ఈమాట మే 2013 సంచికకు స్వాగతం!

పి. బి. శ్రీనివాస్ (22 సెప్టెంబర్ 1930 - 14 ఏప్రిల్ 2013): పిబిఎస్గా సంగీతాభిమానులకు చిరపరిచితుడు, దక్షిణభారత సినీసంగీతానికి కలికితురాయి అయిన ప్రతివాద భయంకర శ్రీనివాస్ కేవలం గాయకుడే కాదు, బహుభాషాకోవిదుడు, సాహిత్యవేత్త కూడా. సహృదయుడు, అజాతశత్రువు, ఆయన స్మృతికి నివాళిగా జెజ్జాల మోహనరావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, పరుచూరి శ్రీనివాస్లు సమర్పిస్తున్న బహుభాషా సినీగీతభరిత వ్యాసం ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్; ఆ సంగీత కళానిధి జీవితాన్ని, ఆయన ఛందో విజ్ఞానాన్ని సంగ్రహంగా పరిచయం చేస్తూ ఏల్చూరి మురళీధర రావు వ్యాసం సంగీత సాహిత్య శ్రీ నివాసుడు; భారతదేశంలో కవి పుస్తకాన్ని రచించడు, పుస్తకమే కవిని రచిస్తుంది. అంటే పుస్తకానికి అర్థం మారితే దానితో పాటు కర్త కూడా మారతాడు అంటూ తన సిద్ధాంతానికి మరికొంత వివరణ ఇస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు.
ఈ సంచికలో: ఇంద్రాణి, సాయి పద్మ, స్వాతికుమారి, ఎలనాగ, దేశికాచార్యులు, భాస్కర్, తః తః, సత్యనారాయణల, మల్లావధాని, మోహన రావుల కవితలు; గౌరి కృపానందన్, శర్మ దంతుర్తి, శారదల కథలు; రాళ్ళపల్లి సుందరం, సురేశ్ కొలిచాల, భరణి కొల్లిపర, పి. బి. శ్రీనివాస్ల వ్యాసాలు; బృందావనరావు సమర్పించే నాకు నచ్చిన పద్యం…